ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలోని చిన్నచిన్న పట్టణాల్లో కూడా రియల్ బూమ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు ఇచ్చేలా ఉన్నాయి. కొన్ని పట్టణాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపునిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాజధాని హైదరాబాద్ చుట్టూ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. అయినప్పటికీ రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ రింగ్ రోడ్స్ కారణంగా శివారు ప్రాంతాల్లో రియల్ బూమ్ ఏ స్థాయికి చేరుకుందో చూస్తున్నాం. ఇప్పుడు ఇదే తరహాలో జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్స్ నిర్మించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దమవుతోంది. అంటే ORR, RRR పరిసరాల్లో మాదిరిగానే జిల్లా కేంద్రాల శివార్లలో భూములకు రెక్కలు రానున్నాయి… రియల్ ఎస్టేట్ ఊపందుకోనుంది.
రేవంత్ సర్కార్ ప్లాన్ ఇదే..
రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా ఈ రింగ్ రోడ్స్ ఉపయోగపడతాయని… తద్వారా సరుకు రవాణా వేగం పెరుగుతుందని అన్నారు. అంతేకాదు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని… తద్వారా ప్రజల ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని అన్నారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు సమీపంలో జాతీయ రహదారులు ఉంటే వాటిని అనుసంధానించేలా రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. జిల్లా కేంద్రాల నుంచి రింగు రోడ్లకు అనుసంధానించేలా రేడియల్ రోడ్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. జాతీయ రహదారులకు రింగు రోడ్లను అనుసంధానించే అంశంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుందా..?
ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందనే చెప్పాలి. గతంలో పంటలుపండే వ్యవసాయ భూములు కాదు బీడు, రాళ్లు, కొండకోన ప్రాంతాల్లోని భూములు కూడా లక్షలు, కోట్లు పలికాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు… ధరలు సగానికి సగం పడిపోయాయి. దీంతో భూములు అమ్మేవారు, కొనేవారు సైలెన్స్ అయిపోయారు… రియల్ ఎస్టేట్ నెమ్మదించింది. ఈ క్రమంలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కు బూస్ట్ ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటోంది… అందులో భాగమే ఈ జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్స్ ప్రతిపాదన. భవిష్యత్ లో తెలంగాణ జిల్లా కేంద్రాల్లో రియల్ భూమ్ ఖాయంగా కనిపిస్తోంది.