బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజల సౌకర్యార్థం నూతనంగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం ఆయన నిర్మల్ నుండి నేరడిగొండ, వడూర్, బొందిడి, దర్భా, ధన్నూర్, కుచూలపూర్ మీదుగా బోథ్ కు నడవునున్న బస్సు ను జెండా ఊపి ప్రారంభించారు. కొంత దూరం వరకు ఆయన ప్రయాణికులతో కలిసి బస్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి బోథ్ నియోజకవర్గ మారుమూల ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని మంత్రులను, ఆర్టీసీ అధికారులను కొత్తగా 11 బస్సులను నడిపించాలని కోరానని అన్నారు. తన వినతి మేరకు ఆర్టీసీ ప్రారంభించిన ఈ బస్ లను ఆయా ప్రాంతాల ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా దశాబ్దాలుగా కోరుతున్న బస్ సర్వీసు తమ గ్రామాల మీదుగా రాకపోకలు కొనసాగిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి తమ గ్రామాలకు ఆర్టీసీ బస్ వచ్చినందున ఎక్కడిక్కడ బస్ లకు పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.