Take a fresh look at your lifestyle.

గణనపై సంపూర్ణ అవగాహన అవసరం.—జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

 

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:

జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా మొదట ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకుగాను గణనపై సంపూర్ణ అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం గద్వాల ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లాస్థాయి చార్జ్ అధికారులు, అదనపు చార్జ్ అధికారులకు ఇండ్ల గణనపై మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జన గణన, ఇండ్ల గణన కార్యక్రమంలో భాగంగా 2026 సంవత్సరంలో మొదటి విడతలో ఇండ్ల గణన కార్యక్రమాన్ని పూర్తి డిజిటలైజేషన్ పద్ధతిలో స్మార్ట్ ఫోన్ ద్వారా చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించి వివరాలు నమోదుచేసి ఇండ్ల జాబితా రూపొందిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియను ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, చార్జింగ్ అధికారులు నిర్వహిస్తారని, చార్జ్ అధికారులుగా తహసిల్దార్లు, అదనపు చార్జ్ అధికారులుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఉండే జనాభా ఆధారంగా బ్లాక్ లుగా విభజించుకొని గణన చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఇండ్ల గణన పూర్తయితే 2027 ఫిబ్రవరిలో ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం నిర్దేశించిన 33 ప్రశ్నలను అడిగి వివరాలను నమోదు చేస్తారన్నారు. ప్రస్తుతం చేపట్టే గణన ఆధారంగానే భవిష్యత్తులో వివిధ వర్గాలకు ఆయా సందర్భాల్లో రిజర్వేషన్లు నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి గణనను పక్కాగా చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో సుమారు 1100 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు అవసరమవుతారని, ఉపాధ్యాయులకు ఈ విధులు అప్పగించాలన్నారు. ఈ జనాభా గణనను పూర్తిగా డిజిటల్ విధానంలో చేయాల్సి ఉన్నందున 2026-2027 సెన్సెస్ ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. సెన్సెస్ ఇండెక్స్ పుస్తకాన్ని పూర్తిగా చదివి అవగాహన పెంపొందించుకోవాలని, ట్రైనర్లు వివరించే ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఇండ్ల గణన కార్యక్రమాన్ని నిర్వహించి కార్యచరణ ప్రకారం జాబితా రూపొందించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి అంశాన్ని నేర్చుకుంటూ ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే ట్రైనర్స్ ను అడిగి వెంటనే పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డిఓ శ్రీనివాసరావు, సెన్సెస్ ఆపరేషన్ జాయింట్ డైరెక్టర్ లాజర్, సిపిఓ పాపయ్య, ట్రైనర్ సుల్తాన్, సంబంధిత ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.