ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
అన్ని దానల్లో కెల్ల గొప్ప దానం అవయవ దానం అని వారు భావించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కానీ కుటుంబ సభ్యులు కన్న పేగు బంధాన్ని తెంచుకుని.. మరో నలుగురిలో తమ కన్న కొడుకుని చూసుకోవాలని ఉద్దేశంతో అవయవదానానికి సిద్ధమయ్యారు. వివరాలోకి వెళ్లితే….
ఈనెల 17న గద్వాల రైల్వే స్టేషన్ రోడ్డులో ఆర్టీసి బస్సు, బైక్ డీకొన్న సంఘటనలో బైక్ పై వెళ్తున్న అయిజ పట్టణానికి చెందిన రాము సంఘటన స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదంలో మిట్టదొడ్డి గ్రామానికి చెందిన బెల్లంకొండ విష్ణు చైతన్య గుప్తా (17 సంవత్సరాలు) తీవ్రంగా గాయపడ్డాడు. మరో విద్యార్థి గద్వాలకు చెందిన వర్దన్ కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన విష్ణుచైతన్యను హైదరబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. గత 5 రోజులుగా హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష్ణు చైతన్య శనివారం తుదిశ్వాస విడవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయినప్పటికీ తమ కుమారుడు మరణం మరో నాలుగు కుటుంబాల్లో వెలుగులు నింపాలని..మృతుడి తండ్రి బెల్లకొండ నాగరాజుశెట్టి దంపతులు అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నారు. తమ కుమారుడి మరణానంతరం కూడా 8 ప్రధాన అవయవాలు మరియు 50కి పైగా టిష్యూ భాగాలను దానం చేసి, 8 మంది ప్రాణాలను కాపాడి పలువురికి ఆదర్శంగా నిలిచారు. తుది లాంచనాలు చేసి యువకుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా శనివారం సాయంత్రం మిట్టదొడ్డి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.