ముద్ర,కుషాయిగూడ
అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్సీ విజయశాంతి తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను లేవనెత్తిన నేపథ్యంలో ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆమెను కలసి తమ కృతజ్ఞతలను తెలిపారు.
గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను విస్మరించి, మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల సమస్యలను కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రకటనలో చేర్చినప్పటికీ, రెండు సంవత్సరాలు గడిచినా పరిష్కారంపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు, మండలిలో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ ఉద్యమకారుల సమస్యలను ఎవరూ ప్రస్తావించకపోవడం బాధాకరమని తెలిపారు. కేవలం విజయశాంతితో పాటు సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యూల్, రామ్మోహన్ రెడ్డి మాత్రమే స్పందించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ బాధ్యతలను ఎందుకు నిర్వర్తించడం లేదని ప్రశ్నించారు. సమస్యలపై స్పందించకపోతే వారి ఇళ్లను ముట్టడి చేసి, గేరావ్ చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి, సుల్తాన్ యాదగిరి, మల్లూరి అనిల్ కుమార్, రామగిరి ప్రకాష్, గుండా యాదగిరి, సామా అంజిరెడ్డి, చంద్రన్న ప్రసాద్, కంచర్ల బద్రి, మోత్కూరి మల్లేష్, బీరకాయల మధుసూదన్, పుట్టా రంజిత్, బోయపల్లి రంగారెడ్డి, శంకర్రావు, హరిప్రసాద్, సత్యం, రాజు, గంధమాల యాదగిరి, యనమల రవి, ఎర్ర జాన్సన్, అంజలి కుమారి, బాకారం లావణ్య, లక్ష్మికాంతమ్మ, ఓగిరాల సుజి, లలిత, పుష్ప, దుర్గాని శ్యామల, కమల, అరుణ, స్వరూప, భాస్కర్, మోజేష్ తదితరులు పాల్గొన్నారు.