Take a fresh look at your lifestyle.

ఎవరా మంత్రి..? అధికార పార్టీలో వివాదస్పదంగా ఓ మంత్రి తీరు

  • తన జిల్లా దాటి.. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బాసిజం
  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తలదూర్చుతున్నట్లు ఆరోపణలు
  • మంత్రి తీరుపై భగ్గుమంటున్న బాధిత ఎమ్మేల్యేలు
  • నగర శివారులోని హోటల్ లో 11 మంది రహస్య భేటీ
  • ఆ ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడిన మరో నలుగురు
  • తమ నియోజకవర్గాల్లో పనులు చేసుకోనివ్వడం లేదంటూ అసంతృప్తి
  • అక్కడ్నుంచే టీపీసీసీ చీఫ్ కు బాధిత ఎమ్మెల్యేల ఫోన్
  • కూర్చొని మాట్లాడుకుందామన్న మహేశ్ కుమార్ గౌడ్
  • మీరేం చేయలేరంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై బాధిత ఎమ్మెల్యే ఫైర్
  • వెంటనే సీఎంకు వివరించిన టీపీసీసీ చీఫ్
  • రంగంలో దిగిన సీఎం రేవంత్
  • రాష్ట్ర మంత్రివర్గంతో అత్యవసర సమావేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్​ శివారులోని ఓ హోటల్​ లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేల రహస్య భేటీ రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేపింది. ముఖ్యంగా అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఓ కీలక నేతపై అసంతృప్తితో రగిలిపోతోన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు గత నెల 31న రహస్యంగా సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్​ టాపిక్​ గా మారింది. ఆయనకు తమ సంపూర్ణ మద్దతు,సర్వాధికారాలు అప్పగించిన సీనియర్ల తీరుపై మండిపడ్డ ఆయా ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ మేరకు భేటీ తర్వాత తాము తీసుకున్న నిర్ణయం గురించి టీపీసీసీకి వివరించాలని భావించిన బాధిత ఎమ్మెల్యేలు అక్కడ్నుంచే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు ఫోన్ చేసి సదరు మంత్రిపై ఫిర్యాదు చేశారు. సదరు మంత్రి తమ నియోజకవర్గాల్లో భూములు రెగ్యులర్ చేసుకుంటున్నారని మండిపడినట్లు తెలిసింది. అలాగే నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు మంజూరు చేయడంలో అంతులేని జాప్యం చేస్తున్నారని పార్టీ అధ్యక్షుడికి మొరపెట్టారు. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండానే మంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారని వినిపిస్తోంది.బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వంలో పనులు అవుతున్నాయని, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఆలస్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించినట్లు సమాచారం.అయినా ఏ మాత్రం తగ్గని బాధిత ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది.

ఎన్నికల ముందు లొల్లి..!

స్థానిక సంస్థలు,ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళన అధికార పార్టీ ముఖ్య నేతల్లో మొదలైంది. ఈ క్రమంలో అసంతృప్త ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడిన టీపీసీసీ చీఫ్​.. తొందరపడొద్దని సూచించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఆయన సీఎంతో కలిసి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు. వెంటనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే ఎమ్మెల్యేల రహస్య భేటీ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రంగంలో దిగిన సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో అత్యవసర భేటీ నిర్వహించారు.ఇందులో ఎమ్మెల్యేలకు మంత్రులకు సమన్వయంపై సీఎం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే టీపీసీసీలో వర్గీకరణపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల రహస్య భేటీ అధికార పార్టీని సందిగ్దంలో పడేసింది. ఇదీలావుంటే ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రచారాన్ని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు. ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు.

సీఎం,మంత్రులతో అంతా సఖ్యతతో కలసి పని చేస్తున్నారని చెబుతున్నారు. పాలన చూసి ఓర్వలేకే ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ సీరియస్ అవుతున్నారు. అలాగే కమాండ్​ కంట్రోల్​ కేంద్రంలో మంత్రివర్గంతో సీఎం భేటీపైనా వివరణ ఇచ్చారు. ఇది కేవలం ప్రభుత్వ పాలనపై, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు పై నిర్వహించే రివ్యూ మీటింగ్ లాంటిదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు తీసుకోవాల్సిన చర్యలను సీఎంతో పాటు మంత్రులు నిర్ణయాలు తీసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేశారని చెబుతున్నారు.మరోవైపు రహస్య భేటీలో పాల్గొన్న ఓ ఎమ్మెల్యే మాత్రం తాము రహస్యంగా సమావేశం అయినట్లు ఒప్పుకున్నారు. అయితే ఇందులో ఏ మంత్రి పైనా వ్యతిరేకతతో భేటీ కాలేదన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిసి చర్చించుకున్నామన్నారు. ఇందులో అసెంబ్లీ సెగ్మెంట్లకు మంత్రులకు ఇస్తున్నట్టే ఎమ్మెల్యేలందరికీ సమాన నిధులు ఇవ్వాలని తీర్మాణం చేశామన్నారు. ఇదీలావుంటే ఎమ్మెల్యే రహస్య భేటీలో ఉమ్మడి నిజామాబాద్​, మహబూబ్​ నగర్​, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.