- పనుల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన ఆసుపత్రుల భవన నిర్మాణ పనుల్లో జాప్యం కూడదని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆదేశించారు.ఆసుపత్రుల భవన నిర్మాణాల పనుల ఆలస్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.సనత్ నగర్లో ఆసుపత్రిని వచ్చే జూన్ 2వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, పనులు ఎందుకు వేగంగా కొనసాగడం లేదని అధికారులను ఆయన నిలదీశారు.ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల భవన నిర్మాణాలను ఎప్పటి లోగా పూర్తి చేస్తారో సాంకేతికంగా అంచనా వేసిన నివేదికను తనకు అందజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.ఈ మేరకు సచివాలయంలో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షను మంత్రి కోమటిరెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లేనిపోని కుంటుసాకులతో నిర్మాణాలను ఆలస్యం చేయడం తగదన్నారు.కాంట్రాక్టర్లతో పని చేయించడం కూడా రాదా అని అధికారులను ప్రశ్నించారు.ఆసుపత్రులకు సంబంధించిన నిర్మాణ పనులను ఆర్ అండ్ బీ , వైద్య పరికరాలను వైద్యారోగ్య శాఖ అంచనా వేసుకోవాలని ఆయన సూచించారు.ప్రతి వారం ఆసుపత్రుల నిర్మాణ పురోగతిపై సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.