ముద్ర కూకట్పల్లి :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి పి సిసి) ఉపాధ్యక్షులు మరియు కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్, బుధవారం నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గుమ్మల శ్రీజన ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్ళిన ఆయన, కమిషనర్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి
ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని పెండింగ్లో ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన తక్షణ చర్యలు మరియు కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై బండి రమేష్ కమిషనర్తో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా కూకట్పల్లి ప్రధాన కూడలి వద్ద రానున్న నూతన ఫ్లై ఓవర్ పనుల పురోగతి.
రోడ్డు విస్తరణ: జేఎన్టీయూ సమీపంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు చేపట్టాల్సిన రోడ్డు విస్తరణ మరియు ఫ్లై ఓవర్ ప్రణాళికలు.
నియోజకవర్గ పరిధిలోని చెరువులను కాలుష్య రహితంగా మార్చి, వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం.
కోర్ అర్బన్ రీజియన్లో భాగంగా డ్రైనేజీ మరియు తాగునీటి వ్యవస్థ మెరుగుదల.
కమిషనర్ సానుకూల స్పందన
సమావేశం అనంతరం కమిషనర్ శ్రీజన మాట్లాడుతూ.. నియోజకవర్గ సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. త్వరలోనే జోనల్ మరియు సర్కిల్ స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.