ముద్ర, శేరిలింగపల్లి:
రెజ్లింగ్ పోటీల్లో ప్రథమ స్థానాన్ని సాధించిన అర్కపల్లి అరవింద్ ను టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అభినందించారు. జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయానికి వచ్చిన అరవింద్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి ఆశిస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అతినిని సీఈవో శాలువా కప్పి సన్మానించి అభినందించడంతో పాటు తక్షణ సహాయం అందించారు. భవిష్యత్ లో ఎదుర్కోబోయే పోటీలకు ప్రభుత్వ పరంగా తన పూర్తి సహాకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మారు మూల గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన అర్కపల్లి సైదులు కుమారుడైన అరవింద్ (15) రెజ్లింగ్ పోటీల్లో మొదటి స్థానం పొందడం రాష్ట్రానికే కాకుండా ఉన్న ఊరికి, కన్న తల్లికి మంచి పేరు తెచ్చిపెట్టాడని అభినందించారు. 19వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదిన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో జరిగిన రెజ్లింగ్(కుస్తీ) పోటీల్లో విజేతగా నిలువగా వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి ద్వితీయ స్థానం సంపాదించాడు. 10వ తరగతి చదువుతున్న అరవింద్ ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తమ గ్రామానికి చెందిన విద్యార్థిని వెన్ను తట్టి ప్రొత్సహించడం పట్ల గ్రామానికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు.