శేరిలింగంపల్లి నియోజకవర్గ పెండింగ్ పనులపై దృష్టి సారించాలి నూతన కమిషనర్ కు సూచించిన పీయేసీ ఛైర్మన్ గాంధీ
ముద్ర, శేరిలింగంపల్లి:
నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్గా ఐఏఎస్ అధికారి శ్రీమతి జి.సృజన బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా మాదాపూర్ లోని న్యాక్ బిల్డింగ్ – సైబరాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో తాజా మాజీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, భాస్కర్, కృష్ణా రెడ్డి తో కలిపి శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు తొలి కమిషనర్గా ఐఏఎస్ అధికారి శ్రీమతి జి. సృజన గారు బాధ్యతలు స్వీకరించిన శుభసందర్బంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నామని, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెరుగైన మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధిపై సైబరాబాద్ కమీషనర్ సృజన ప్రత్యేక దృష్టి సారించిన్నట్లు చైర్మన్ గాంధీ తెలియచేసారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనతో చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని, అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని, చెరువుల సుందరీకరణ, పార్క్ ల అభివృద్ధి పనులలో ప్రత్యేక దృష్టి సారించాలని చైర్మన్ గాంధీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.