Take a fresh look at your lifestyle.

కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలతో మమేకం: సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్

 

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవం

ముద్ర, శేరిలింగంపల్లి:

సైబరాబాద్ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ మెట్రోపాలిటన్ చట్టం ప్రకారం 2003లో స్థాపించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతానికి సేవలందిస్తున్న ప్రముఖ అర్బన్ పోలీసింగ్ వ్యవస్థగా నిలిచిందని గుర్తుచేశారు. నాటి తొలి సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఎం. మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారని, ఈ 23 ఏళ్ల ప్రస్థానంలో ప్రాంత అభివృద్ధిలో పోలీసుల కష్టం, స్వేదం, త్యాగం కీలక పాత్ర పోషించాయన్నారు. సైబరాబాద్ లో నిర్మించిన ప్రతీ కట్టడంలో, జరిగిన ప్రతి అభివృద్ధి పనుల్లో సైబరాబాద్ పోలీసుల సేవలు చిరస్థాయిగా, అజరామరంగా నిలిచిపోయాని, జాతీయ పతాకం సాక్షిగా ప్రజాసేవకు మరింత అంకితభావంతో పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

సాంకేతికతను వినియోగిస్తూ ఆధునిక పోలీసింగ్‌లో సైబరాబాద్ కమిషనరేట్ దేశ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని సీపీ తెలిపారు. పునర్విభజనల నేపథ్యంలో, జనాభా, విస్తీర్ణం ఆధారంగా ‘కోర్ అర్బన్ రీజన్ (CURE)’ని మూడు జోన్లుగా విభజించడం జరుగిందని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌తో సమన్వయం పెంచుతూ పోలీస్ స్టేషన్లు, డివిజన్లను మున్సిపల్ వార్డులు, సర్కిళ్లకు అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు.

సైబరాబాద్ పోలీసులు టెక్నాలజీ ఆధారిత కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్, సైబర్ క్రైమ్ దర్యాప్తులు, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, పబ్లిక్ –ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయన్నారు. సైబరాబాద్ పోలీసుల ప్రొఫెషనల్ నైపుణ్యాలకు జాతీయ స్థాయి పురస్కారాలు లభించాయన్నారు. సైబరాబాద్ ప్రాంతం దేశ జీడీపీకి గణనీయంగా తోడ్పడుతున్నదని, ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఎంఎస్‌ఎంఈలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాల వృద్ధికి పోలీసులు కల్పించే భద్రతే పునాది అని సీపీ స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు భద్రతా వ్యవస్థ బలోపేతం అయ్యిందని, 23 ఏళ్ల ప్రగతి ప్రతిబింబించే ప్రత్యేక వీడియోను ఆవిష్కరించినున్నట్లు తెలిపారు. అలాగే, సైబరాబాద్ ఇప్పటివరకు కమిషనరేట్‌లో సేవలందించిన మాజీ పోలీస్ కమిషనర్లను సన్మానించనున్నట్లు తెలిపారు.

సైబర్ నేరాలు, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని సీపీ తెలిపారు. యుద్ధాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి, వ్యాపారం, పనుల కోసం వచ్చిన లక్షలాది మంది వలస కార్మికుల భద్రత, సంక్షేమం పోలీసుల బాధ్యత అని చెప్పారు. వారికి ఇన్సూరెన్స్, మెడికల్ కేర్ వంటి సదుపాయాలు నిబంధనల ప్రకారం అందించాల్సిందేనని, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సేవ, ప్రవర్తన ద్వారా ప్రజల విశ్వాసం గెలవాలని, ‘కమ్యూనిటీ కనెక్ట్’ కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు పోలీసులు తోడుగా ఉన్నారన్న భరోసా కల్పించాలని అన్నారు. సైబరాబాద్ లో ప్రత్యేక నేర విభాగాలు, సైబర్ ఎన్ ఫోర్స్ మెంట్ యూనిట్లు, ప్రజలతో భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా భద్రతను మరింతగా బలోపేతం చేస్తున్నామన్నారు.

కార్యక్రమంలో భాగంగా సీపీ ఆఫీసు ప్రాంగణంలో సీపీ మొక్క నాటారు. అనంతరం ధీర, వీర, ధృవ, భీమ, రాఖీ, తేజ, మౌని, లైకా పోలీసు జాగిలాల గౌరవ వందనం సమర్పించాయి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సీపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీసు సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఫార్మేషన్ డే సందర్భంగా నార్సింగి సైకిల్ ట్రాక్ పై ప్రజలతో కలిసి పోలీసులు ప్రజలతో కలిసి సైక్లింగ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.