- వేసవి వరకు తాగునీటిని ఎలా సరఫరా చేస్తారు.
- మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు.
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : లోయర్ మానేరు డ్యాం నుండి ప్రణాళిక లేకుండా నీటిని కిందికి విడిచి పెడుతూ, కరీంనగర్ పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు తీసుకు వస్తున్నారని,ప్రస్తుతం డే బై డే నీటిని సరఫరా చేస్తే, రాబోయే కాలంలో తాగునీటిని సరఫరా చేస్తారా.? లేకపోతే ప్రజలను మంచినీళ్ల కోసం గోస పడేలా చేస్తారా.? అని బిజెపి నాయకులు, తాజా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రశ్నించారు.శుక్రవారం సాయంత్రం కరీంనగర్లోని ఎస్ బి ఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం లోయర్ మానేరు డ్యామ్ లో ఐదున్నర టీఎంసీల నీరు మాత్రమే ఉందని , అలాంటప్పుడు నీటిని కిందికి వదిలితే కరీంనగర్ ప్రజల తాగునీటి అవసరాలను ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న నీటిలో రెండు టీఎంసీల వరకు సిల్ట్ ఉంటుందని అధికారులే చెబుతున్నారని, ఉన్న మూడు టీఎంసీలను పూర్తిగా కిందికి వదిలితే, డ్యామ్ లో నీళ్లు ఎక్కడుంటాయన్నారు.కనీసం తాగునీళ్లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడతారా..? ఇదేమి కుట్ర.? ప్రజల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత కోపం ఎందుకు.? 16 నెలల్లో కరీంనగర్ లో ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదు.మీరు అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, కనీసం ప్రజలకు తాగునీటిని సరఫరా చేయండి , ఇప్పటివరకు కరీంనగర్ ప్రజలు నీళ్ల కోసం ఇబ్బంది పడ్డ పరిస్థితులు లేవు., ప్రజలను, ముఖ్యంగా మహిళలను నీళ్ల కోసం ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దన్నారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టి లో ఉంచుకొని తాగునీటి అవసరాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా ఇన్చార్జి మంత్రి, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్, కమిషనర్లు ఇప్పటి నుంచే తగిన చర్యలు చేపట్టాలని,వెంటనే ఎస్సారెస్పీనుండి నాలుగు టీఎంసీల నీటిని లోయర్ మన డ్యామ్ కు విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ప్రజలకు తాగునీటి కష్టాలు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని బిజెపి ప్రజలకు అండగా నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.ఇట్టి సమావేశంలో తాజా మాజీ కార్పొరేటర్లు కొలగని శ్రీనివాస్, దుర్శేట్టి అనుప్, చంద్రమౌళి, వంగల పవన్, బిజెపి నాయకులు కటకం లోకేష్, బొంతల కళ్యాణ్ చంద్ర, నాంపల్లి శ్రీనివాస్ ,పొన్నం మొండయ్య గౌడ్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.