ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి.
ఓటరు జాబితాలో తప్పులు ఉంటే అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.ఎస్ఐఆర్ మ్యాపింగ్, ఇంటింటి సర్వే ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన బిఎల్ఓలకు తాకిదులు తప్పవని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య స్పష్టం చేశారు . ప్రతి ఇంటికి వెళ్లి నిజమైన ఓటర్లను గుర్తిస్తూ మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఈ ఆర్ఓలు, ఏఈఆర్ఓ లు, బిఎల్వోలు, సూపర్వైజర్ల ను ఆదేశించారు .
బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పటాన్ చెరువు, సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాలకు చెందిన ఈఆర్ఓ లు, ఏ ఈఆర్ఓ లు, బిఎల్వోలు, సూపర్వైజర్లతో వీడియో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి బిఎల్ఓ తన పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి ఎస్ఐఆర్ మ్యాపింగ్ పక్రియను వేగవంతం చేయాలని అన్నారు . ఓటర్ల జాబితా ఖచ్చితత్వం కోసం నిర్వహించే ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓలు కీలక పాత్ర పోషించాలని అన్నారు .బిఎల్ఓ లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని తెలిపారు . ఎస్ఐఆర్ మ్యాపింగ్ పక్రియలో నిర్లక్ష్యం వహించే బిఎల్వోలకు తాకిదులు తప్పవని స్పష్టం చేశారు.
ప్రతి పోలింగ్ స్టేషన్కు బిఎల్వో తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, బిఎల్వోలు లేని పోలింగ్ కేంద్రాలకు వెంటనే బిఎల్వోలను నియమించాలని ఈఆర్ఓ లను ఆదేశించారు . ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం 13 కేటగిరీలలో బిఎల్వోలను నియమించుకోవచ్చని అన్నారు . బిఎల్వోల వివరాలను ఈసీఐ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఆర్ఓలు ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు,ఆర్డీవో రాజేందర్,ఎన్నికల విభాగం సెక్షన్ అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.