నేతాజీ నగర్ లో హిందూ సమ్మేళనం
ముద్ర న్యూస్ బ్యూరో మెహిదీపట్నం: హిందువుల ఐక్యతను చాటి చెబుతూ మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో శనివారం రాత్రి హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోల్కొండ భాగ్ కార్యకారిణి మలిపెద్ది శంకర్, జగద్గిరి గుట్టలోని కేదార్నాథ్ క్షేత్రం స్వామీజీ శివరుద్ర సాధువు, మహిళా వక్త వాణి సక్కుబాయి ఈ సమ్మేళనంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఛత్రపతి శివాజీ మొదలుకొని హెగ్డేవార్ దాకా ఎందరో నేతల స్ఫూర్తితో హిందూ జాతి ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ సమ్మేళనంలో హైందవ జాతి ఐక్యతను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను వక్తలు చాటి చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. నేతాజీ నగర్, ఓం నగర్, శ్రీనివాస్ నగర్, జ్యోతి నగర్, మారుతి నగర్ హిందూ సమ్మేళన సమితి శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మేళనంలో వందలాదిమంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి నేతాజీ నగర్ కు చెందిన డాక్టర్ జనార్దన్, టీ ఎస్ ఆనంద్ రెడ్డి, కేవీబీ మురళీ మోహన్ రావు,రంగప్రసాద్, కే పద్మావతి ఆధ్వర్యంలో పుష్పావతి, పరిమళ శ్రీనివాస్, శ్రీనివాస నగర్ చెందిన జానకీ రామ్, మారుతి నగర్ కు చెందిన సతీష్ చంద్, ఓంనగర్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి చక్కటి ఏర్పాట్లు చేశారు.
