గృహ గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు పౌర సరఫరాల శాఖాధికాకులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలు గృహ సంబంధ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పౌర సరఫరాల శాఖాధికారులను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ల, రబీ పంటలకు సాగునీరు సరఫరా, వరి ధాన్యం కొనుగోలు అంశాలపై శుక్రవారం హైదరాబాదు నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కలిసి వీసీలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో వంట గ్యాస్ కు కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గృహ సంబంధిత ఎల్పీజీ గ్యాస్ సరఫరా విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పారసరఫరాల శాఖ అధికారి వనజాత, మేనేజర్ హరీష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉష, ఉద్యానవన శాఖ అధికారి సురేష్, మార్కెటింగ్ శాఖ అధికారి రియాజొద్దీన్, ఇరిగేషన్ అధికారులు, మార్క్ ఫెడ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.