-రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేత
ముద్ర న్యూస్, గొల్లపల్లి:
ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక సామాన్య రైతు కుటుంబానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే మానవత్వమని నిరూపిస్తూ, బాధిత కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన రైతు గుడ్ల రాజయ్యఇటీవల జరిగిన టిప్పర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రైతును పరామర్శించడానికి వెళ్లిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కు జరిగిన లిఫ్ట్ ప్రమాదం అందరికీ తెలిసిందే. పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆ రైతు చికిత్స పొందుండగా.. ఆసుపత్రి ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న విషయం కలిసి వేసింది.
వెంటనే స్పందించిన మంత్రి:
విషయం తెలిసిన వెంటనే మంత్రి మానవతా దృక్పథంతో స్పందించారు. రాజయ్య వైద్య చికిత్సల నిమిత్తం తక్షణ సహాయంగా రూ. 50,000 నగదును కేటాయించారు. మంత్రి గారి సూచన మేరకు స్థానిక నాయకులు, రైతుల ద్వారా ఈ ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాతిగా ఉంటుంది. రాజయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.
కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు:
మంత్రి గారు చూపిన ఈ చొరవపై అగ్గిమల్ల గ్రామస్తులు మరియు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన రైతు కష్టాల్లో ఉన్నప్పుడు స్వయంగా స్పందించి, ఆర్థిక భరోసా కల్పించిన మంత్రికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్గిమల్ల సర్పంచ్ కంకణాల వసంత లక్ష్మణ్, జెల్ల అఖిల అనిల్, గొల్లపల్లి ఉపసర్పంచ్ గురజాల బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సట్టా ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.