ముద్ర ప్రతినిధి, నిర్మల్:
అంబటి కవిత్వం సామాజిక చైతన్యానికి ప్రతీక అని పలువురు వక్తలు కొనియాడారు. నిర్మల్ కు చెందిన అంబటి నారాయణ రచించిన ‘ పుడమిని ముద్దాడిన పొద్దు ‘ కవితా సంపుటిని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సామాజిక సాంస్కృతిక కళా తాత్వికపరమైన కవిత్వం ఇందులో దాగి ఉందన్నారు.ప్రతిరోజు సూర్యుడు ఉదయించకముందే అంబటి కవిత్వం సామాజిక మాధ్యమ సమూహాలలో ప్రత్యక్షమవుతుందన్నారు. అనునిత్యం ఉదయాన్నే ఓ కొత్త కవితతో అంబటి పలకరించగలడని అన్నారు. వస్తువులో వైవిధ్యం, అభివ్యక్తిలో విలక్షణత దాగి ఉందని అన్నారు.ముఖ్య అతిథి గా ప్రముఖ కవి గుడిపాటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. జనజ్వాల, మరికంటి,ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, తోడిశెట్టి పరమేశ్వర్, మునీంద్రరాజు, బి.వెంకట్, డా అప్పాల చక్రధారి, నేరెళ్ళ హన్మంతు, నివేదిత, యం.సి.లింగన్న, డా దామెర రాములు, పత్తి శివప్రసాద్, పోలీస్ భీమేశ్, బొందిడి పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.