బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ ను సి ఎం కు వివరించిన అధికారులు
పలు సూచనలు చేసిన సీఎం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం అభివృద్ధి శాస్త్ర సమ్మతంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాసర మాస్టర్ ప్లాన్ అమలు నేపథ్యంలో అధికారులు సి ఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. ఈ నెల 6 సోమవారం అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో వారు సీఎం ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని సూచించారు.
భవిష్యత్ అవసరాలు, పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. కాగా ఈ నెల 6 న రూ.225 కోట్ల విలువైన ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న విషయం తెలిసిందే.