- ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం.
- కొత్త క్యాంపస్లో మూడు కోర్సులు.
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కొత్త క్యాంపస్లో మూడు కొత్త కోర్సులు, 180 సీట్లతో అడ్మిషన్ నోటిఫికేషన్ను జారీ చేసింది. కంప్యూటర సైన్స్ ( సీఎస్ఈ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్), డేటా సైన్స్ కోర్సులు ప్రారంభించనున్నారు. బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ క్యాంపస్ నడవనుంది. ఏడాది క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ను విద్యాకేంద్రం (ఎడ్యుకేషనల్ హబ్)గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ కాలేజీ మంజూరు చేయడంతో హామీ నెరవేరుతుంది. తాత్కాలికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలోని రాజా బహుదూర్ వెంకట్రాం రెడ్డి టీటీసీ కాలేజీలో తరగతులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సులలో ఒక్కో కోర్సుకు 60 సీట్ల చొప్పున విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. పదో తరగతిలో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు కల్పించనున్నారు.