- మండల, జిల్లా స్థాయి కమిటీలు త్వరలోనే పూర్తి.
- పార్టీలో పనిచేసే వారికి ప్రాధాన్యం.
- ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, మండల, జిల్లా స్థాయి కమిటీలను త్వరగా పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. సంస్థాగత నిర్మాణం కూడా తెలంగాణ రాష్ట్రంలోనే బాగా జరుగుతుందన్నారు. రాష్ట్ర పరిశీలకులు, కో ఆర్డినేటర్లు బాగా పని చేస్తున్నారని ఆమె అభినందించారు. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్ నుంచి డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో జూమ్ మీటింగ్ను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మీనాక్షి నటరాజన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను తెలంగాణ లో పెద్దఎత్తున నిర్వహించామన్నారు. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే బాగా చేశామన్నారు. ఏఐసీసీ అగ్రనేతలు కూడా తెలంగాణ ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం మనకెంతో గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్న నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం పకడ్బందీగా చేయాలని ఆమె కోరారు. పార్టీ లో చిత్తశుద్ధితో పని చేసిన వారందరిని వారి వారి స్థాయిలలో తప్పకుండా గుర్తిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కాపాడుతూ పార్టీ లో ప్రభుత్వంలో పదవుల పంపిణీ చేస్తుందని ఆమె వెల్లడించారు. రాహుల్ గాంధీ సమాజంలో ఎవరి వాటా వారికి ఇవ్వాలన్న సిద్ధాంతంతో పని చేస్తున్నారని తెలిపారు. వారి సిద్ధాంతాలను మనం అమలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని పదవులలో సామాజిక న్యాయాన్ని పాటించామని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన అందరికి తప్పక పదవులు లభిస్తాయన్నారు.అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం గణనీయంగా పురోగమిస్తుందని తెలిపారు.రాష్ట్ర పరిశీలకులు, కో ఆర్డినేటర్లు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రశంసించారు.