- ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్.
ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్య బోధన ఉచితంగా అందుతుందని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి వారి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు.నిర్మల్ జిల్లా తానూరు మండలం బొంద్రడ్ లో జరిగిన జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలందరిని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియచెప్పి అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా విద్యా బోధన జరుగుతుందని ప్రజల్లో అవగాహన కల్పించాలని వివరించారు.గ్రామ సమస్యలు దశల వారీగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.