ముద్ర, వీపనగండ్ల: పాలస్తిన పై ఇజ్రాయిల్ దాడులను ఆపాలని కోరుతూ వీపనగండ్ల మండల కేంద్రంలోని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి బాల్ రెడ్డి మాట్లాడుతూ1948కి ముందు ప్రపంచపటంలో అసలు ఇజ్రాయిల్ అనే దేశం లేదని, తలదాచుకోవడానికి స్థలం అంటూ ప్రవేశించి క్రమంగా ఆదేశాన్ని ఆక్రమించి దాడులకు పూనుకోవడం దారుణమన్నారు. చిన్న కారణాలు చూపి యుద్ధం మొదలుపెట్టి అక్కడి మహిళలు, పిల్లలు,వృద్దులు అనే తేడా లేకుండా విచక్షణ మరచి, పాఠశాలలు, ఆసుపత్రులు, ఆలయాలన్నింటిపైనా యుద్ధం చేయడాన్ని వ్యతిరేకించారు.అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించి అమెరికా వత్తాసుతో ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను మానవతా వాదులందరూ ఖండించాలని కోరారు. ఇప్పటికైనా ఐక్యరాజ సమితి కఠిన చర్యలు తీసుకొని గతంలో అంగీకరించిన విధంగా సమస్యను పరిష్కరించాలని కోరారు.అమెరికా తన వాణిజ్య అవసరాలకు యుద్ధం కొనసాగాలని కోరుకూంటుందని, ఇజ్రాయిల్కు ఆయుధ సామగ్రి అమ్మి సొమ్ము చేసుకుంటుందని పేర్కొన్నారు.దాడులు ఆపి ప్రపంచశాంతి కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం. ఆది సిపిఎం మండలం నాయకులు మాజీ ఉప సర్పంచ్ సిహెచ్ వెంకటయ్య, బాలస్వామి, ఆశన్న, ఈశ్వర్, నిరంజన్, శేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్ల గౌడ్, నవీన్, రామకృష్ణ, నరసింహ, రాముడు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.