ముద్ర కూకట్పల్లి :
అర్హులైన ప్రతి బుడగ జంగాల కుటుంబానికి నివాస స్థలాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ భరోసా ఇచ్చారు. కూకట్పల్లిలోని శ్రీ హేమ దుర్గా పార్టీ కార్యాలయంలో బాధితులు ఆయనను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
రోడ్డున పడ్డ నిరుపేదలు గతంలో కైతలాపూర్ సర్వే నెంబర్ 995లోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న బుడగ జంగాల కుటుంబాలను, రెండు ఏళ్ల క్రితం అధికారులు ఖాళీ చేయించారు. ఆ స్థలం ప్రభుత్వానిదని పేర్కొంటూ అధికారులు చర్యలు తీసుకోవడంతో, నాటి నుండి నిలువ నీడ లేక తాము రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితుల విన్నపంపై సానుకూలంగా స్పందించిన బండి రమేష్, వెంటనే స్థానిక ఎమ్మార్వో స్వామితో ఫోన్లో మాట్లాడారు. నిరుపేదలైన ఈ కుటుంబాల పరిస్థితిని వివరించిన ఆయన, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే పరిశీలించి, వారికి నివాస యోగ్యమైన స్థలాన్ని చూపించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు.