Take a fresh look at your lifestyle.

తెలంగాణ రైజింగ్​ మా నినాదం

  • హైదరాబాద్​ను విశ్వనగరంగా మారుస్తాం
  • రాష్ట్రంలో మరో నాలుగు ఎయిర్​పోర్టులు
  • తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలి
  • ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో సీఎం రేవంత్​రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైజింగ్ –2050 నినాదంతో రాష్ట్ర అభివృద్ధిరి ప్రత్యేక ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, విదేశాల్లో స్థిరపడిన తెలుగువాళ్లంతా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్​ రెడ్డి కోరారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చేందుకు అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు ఎయిర్ పోర్ట్ లు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్ సిటీని 30000 ఎకరాలలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

మహాసభలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని మహాసభ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అలాగే వేదిక మీద గల ప్రముఖ నటుడు సాయికుమార్ ను రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ తెలుగు వారందరూ ఎక్కడున్నా, ప్రపంచంతో పోటీ పడడం అలవాటుగా అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే తెలుగువారి ఖ్యాతి చాటి చెప్పినట్లవుతుందన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి ఉత్తర్వులను తెలుగులో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాష ప్రాముఖ్యతపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులు సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు.


ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు నాడు ఐటీ రంగాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చారని, హైదరాబాద్ నగరం ఆర్థికంగా బలోపేతం కావడంలో ఐటీ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. మొదటి స్థానంలో హిందీ ఉంటే, రెండవ స్థానంలో తెలుగు భాష దేశంలో గుర్తింపు పొందిందని, దేశంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్యలో తెలుగు రెండవ స్థానంలో ఉందని సీఎం అన్నారు. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆకాంక్షించారు.

తెలుగు ప్రాముఖ్యత విశ్వవ్యాప్తం కావాలి

తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పేగా మహాసభను నిర్వహించడం ఆనందించదగ్గ విషయమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. తెలుగు సినిమా రంగం నేడు అత్యధిక ప్రజాదరణ పొందుతూ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందడం మనకు గర్వకారణమన్నారు. మాతృభాషలో మనం మాట్లాడడం ద్వార, తెలుగు భాష ఔన్నత్యాన్ని మరింతగా పెంచినట్లుగా ఉంటుందని సీఎం అన్నారు. మహారాష్ట్రలో ఎందరో తెలుగువారు స్థిరపడిపోయారని, అక్కడి ఎన్నికల ప్రచారం కోసం తాను వెళ్లడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.