Take a fresh look at your lifestyle.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి … జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వి.రజని

ముద్ర ప్రతినిధి, వనపర్తి: ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి వి రజిని కోరారు. వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు వీపనగండ్ల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పేదరికం నిర్మూలన పథకాల అమలు పై చట్టపరమైన అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా న్యాయమూర్తి వి రజిని హాజరై మాట్లాడారు. సమాజంలో ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, చిన్నారులు వృద్ధులు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు మూడు లక్షల లోపు సంవత్సర ఆదాయం ఉన్నవారికి లోక్ అదాలత్ ద్వారా న్యాయస్థానాలలో ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు అని సూచించారు.

చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, అందరికీ న్యాయ సేవలు అందించాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. పేదరిక నిర్మూలన పథకాల అమలుపై చట్టపరమైన అవగాహన కలిగి ఉండాలని డి ఆర్ డి ఎ ఏపిడి భాషా నాయక్ అన్నారు. పేదరిక నిర్మూలన కోసం గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2005 సంవత్సరంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని, దానిద్వారా గ్రామాలలోనే కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తూ వలసలను నివారించడం జరిగిందని, గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాల ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా చేయూతను అందించడానికి మహిళా సమైక్య ద్వారా (సెర్ప్) సంఘాలను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాల కోసం బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని వివరించారు.

సైబర్ నేరాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లకు ఎలాంటి ఓటీపీలు వచ్చినా స్పందించకూడదని, లింకులు ఓపెన్ చేయకూడదని ఎస్ఐ కే రాణి సూచించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఆడపిల్లలపై వివక్షత చూపకూడదని, బ్రుణహత్యలు, గృహహింస బాలికలపై అఘాయిత్యాలు, కుటుంబ కలహాల సమస్యలపై అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్, జిల్లా ఇన్చార్జి సిడిపిఓ లక్ష్మమ్మ, పంచాయతీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.