ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
గ్రామ సభలు వార్డు సభల పేరుతో ప్రజాధనం వృధా అని, సమస్యలకు పరిష్కారం లేని సభలు ఎందుకని మాజీ జడ్పి చైర్పర్సన్ దావ వసంతా సురేష్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామసభలు, వార్డు సభలు ఎందుకోసం, ఎవరి కోసం అని ప్రశ్నించారు. గతంలో ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకొని ఒక్కదాని కూడా సమస్యకు పరిష్కారం దొరికిందా? అని ఆమె ప్రశ్నించారు. గ్రామసభలు, వార్డు సభలు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని, కానీ ఏదో నామమాత్రంగా సభలు నిర్వహించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఏ ఒక్క హామీ అయినా అమలు అయిందా అని అన్నారు. బిఆర్ఎస్ హయంలో ఇచ్చిన పెన్షన్లు, రుణమాఫీ, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి వివరాలే మొన్న జరిగిన గ్రామసభల్లో చెప్పరన్నారు. ఇచ్చిన హామీలు వందరోజుల్లో అమలు చేస్తా అన్నప్పటికి ఇంతవరకు ఒక్కటి కూడా అమలు కాలేదు అని అన్నారు. గ్రామ సభలు పెట్టడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేస్తున్నారని, ఎందుకంటే ఒక హామీ కూడా అమలు చేయలేదు. ప్రజలకు ఏమి జవాబు చెప్పాలని, మార్పు మార్పు అని రేవంత్ రెడ్డి గెలిపిస్తే తెలంగాణలో ఏం మార్పు వచ్చిందని అన్నారు. ఎంతమంది ఆడబిడ్డలకు మహా లక్ష్మీ పతకం కింద రూ.2500, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారంతో పాటు రూ.లక్ష చెక్కు ఇచ్చారు అని అన్నారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కేసీఆర్ కావాలని ఎమ్మెల్యే ని గెలిపించుకుంటే గెలిచిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కావాలని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు అని అన్నారు. రేవంత్ రెడ్డి కేరళలో ఎన్నికల ప్రచారం చేస్తూ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశాడని చెప్తున్నారని, తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేశాం అని చెప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. కెసిఆర్ నాయకత్వంలో ప్రజల గొంతుకై ప్రభుత్వాన్ని ఎల్లవేళలా ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.