ముద్ర, తాండూర్ ప్రతినిధి :
ప్రభుత్వ పాఠశాలల్లోనే అపార అనుభవం గల ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పేర్కొన్నారు. గురువారం రోజున తాండూర్ పట్టణంలోని నెంబర్ వన్ ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అపార అనుభవం గల ఉపాధ్యాయులచే విద్యా బోధన జరుగుతుందని, అందుకు నిదర్శనమే పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రావడమేనని కావున విద్యార్థులు వారి సేవలను వినియోగించుకోవాలన్నారు ప్రైవేట్ పాఠశాలలు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాగే జిల్లాలోని అమ్మ ఆదర్శ కమిటీలు తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు అందరు సహకరించి డ్రాప్ అవుట్ విద్యార్థులను తగ్గించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణ, పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం ముఖ్యంగా జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాధించిన నెంబర్ వన్ పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్, ఎమ్మార్వో, ఎంపీడీవో, పాఠశాలల అధ్యాపక బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.