ఆ హైదరాబాద్ వాడిని అడ్డుకోండి అతడు యూపీకి వస్తే మనల్ని ఖతం చేస్తాడు ఎంపీ అసదొద్దీన్ పై ఏఐసీసీ చీఫ్ పరోక్ష వ్యాఖ్యలు
యూపీ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ కు హెచ్చరిక
న్యూఢిల్లీ :
‘ఆ హైదరాబాద్ వాడిని యూపీకి అస్సలు రానీయ వద్దు.. అతను వస్తే మనల్ని ఖతం చేసి పోతాడు’ అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా.. ‘హైదరాబాద్ అంటేనే షేర్వానీ.. బిర్యానీ.. పరేషానీ’అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో యూపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్తో పాటు మరో ఇద్దరు నేతలతో ఖర్గే సంభాషించారు. ఇందులో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదొద్దీన్ ఓవైసీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నేరుగా అసదొద్దీన్ పేరును ప్రస్తావించకుండానే ఆయనతో జాగ్రత్తగా ఉండాలని ఇమ్రాన్ మసూద్ ను అప్రమత్తం చేశారు. ఖర్గే.. అసదొద్దీన్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ముస్లిం ఓటు బ్యాంకు కలిగిన ఇమ్రాన్ మసూద్ వంటి నేతలతో ఖర్గే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ ప్రాధాన్యత నెలకొన్నది. దీంతో ఖర్గేకు హైదరాబాద్ అంటే ఎందుకంత భయం? అని నెటిజన్లు ప్రశ్నించారు. ఓవైసీ పేరు ఎత్తకుండానే ఖర్గే తనలోని భయాన్ని బయటపెట్టారని విమర్శిస్తున్నారు. ఖర్గే చేసిన ఈ ‘ఆఫ్ ది రికార్డ్’ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.