జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని షాక్ ఇవ్వబోతున్నాం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీనిచ్చామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వెల్లడించారు. గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమను గుర్తించారని చెప్పారు.. కొన్నిచోట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయామని, సంస్థాగతంగా బీజేపీ బలపడటం సంతోషకరమన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్న రాంచందర్ రావు… బీజేపీ ఓటు షేర్ భారీగా పెరిగిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ ప్రభావం ఉండబోతోందని జోస్యం చెప్పారు. జనసేన పార్టీతో పొత్తుపై తాము ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదన్నారు. అనారోగ్యంతోనే పవన్ కల్యాణ్ ప్రచారానికి రాలేకపోయారని రాంచందర్ రావు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్న విమర్శలను కొట్టిపారేస్తూ.. మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లాయని, బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందని స్పష్టం చేశారు.