Take a fresh look at your lifestyle.

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి

ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మరియు డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత ప్రజావాణి పోర్టల్‌లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 28 దరఖాస్తులు, డిఆర్డిఏ 14, డిడబ్ల్యుఓ 3, హోసింగ్ 2, మిగిలిన 21 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 68 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్డిఓ పి డి సన్యాసయ, జడ్పీ సీఈఓ శిరీష, డిఎంహెచ్ఓ వెంకటరమణ డీఏఓ శ్రీధర్ రెడ్డి, డిసిఓ ప్రవీణ్ కుమార్, డిఇఓ అశోక్ , జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.