- రేవంత్ పాలనపై చర్చకు మేం సిద్ధం
- గ్యారంటీల అమలు లో ప్రభుత్వం విఫలం
- 14 మాసాల పాలనలో ఒరిగిందేమిటి?
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
ముద్ర ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెసు ఆధ్వర్యంలో తెలంగాణాలో అధికారం చేపట్టిన రేవంత్ పాలనలో చేసిందేమి లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బిజేపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, రేవంత్ రెడ్డి పాలనపై చర్చకు మేం సిద్ధమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై అవగాహనే లేదని ఆయన ఎద్దేవా చేశారు.నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎం ఎల్ సి ఎన్నికల ప్రచారంలో ఆయన శనివారం పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం లేవగానే రాహుల్ ఫోన్ కోసం వేచి చూస్తూ ఢిల్లీ వెళ్లాలనే ఆలోచనే తప్ప రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోరని ఆరోపించారు. గతంలో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు కలిసి అప్పుల ఊబిలోకి నెట్టాయన్నారు. ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమలు సంగతి దేవుడెరుగు…. ఉన్న ఉద్యోగులకు, అవసరాలకే రాష్ట్రంలో నిధులు లేవని ఆరోపించారు. గతంలో తెలంగాణను బంగారు మయం చేస్తానని కుటుంబాన్ని కేసీఆర్ బంగారు మయం చేసుకున్నారని విమర్శించారు. ఇక ప్రస్తుతం రాష్ర్టంలో రియల్ రంగం పూర్తిగా కుదేలయ్యిందన్నారు. కుప్పకూలే పరిస్థితిలో ఉందని మండిపడ్డారు. ఇలా అన్ని రంగాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఇచ్చిన గ్యారంటీలు, హామీలను నెరవేర్చకుండా తనతో చర్చకు వస్తాననడం హాస్యాస్పదమని, ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. మహిళలకు రూ. 2500, నిరుద్యోగ భృతి రూ. 4వేలు, రైతులకు, రైతు కూలీలకు సహకారం, ప్రతీ విద్యార్థికి రూ. 5 లక్షలు, ఉద్యోగాల భర్తీ, స్కూటీలు ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ రేవంత్, రాహుల్ గ్యారంటీలు, హామీలన్నీ శుద్ధ అబద్ధాలేనని 14 నెలల్లో తేలిపోయిందని మండిపడ్డారు. గ్యారంటీలు, హామీలను నెరవేర్చి తనతో చర్చకు రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.
సమస్యల పరిష్కారానికి బీజేపీ సిద్ధం..
మోదీ నేతృత్వంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులు, నిరుద్యోగులు, రైతులు, రైతు కూలీలు, మహిళల సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు శాసనమండలిని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మహబూబ్ నగర్, హైదరాబాద్ తప్ప రాష్ట్రంలోని 500 మండలాల్లో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. మూడు స్థానాల్లో బీజేపీ పోటీలో ఉందని, సమస్యలను తీర్చే సత్తా తమకే ఉన్నందునే నేరుగా ఉపాధ్యాయులు, విద్యావంతులు, మేధావుల వద్దకు వెళ్లగలుగుతున్నామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఆ సత్తా లేకే వెనుకబడ్డాయని పోటీలో లేవని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, పట్టభద్రులు, విద్యావంతులు, ఉద్యోగస్థులు, నిరుద్యోగులు కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు. రాజ్యాంగం ఉపాధ్యాయులకు శాసనమండలి ద్వారా గౌరవాన్ని ఇచ్చిందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో సామాజిక చైతన్యం, అక్షరాస్యత పెంపొందించే విషయంలో ఉపాధ్యాయులే కీలకపాత్ర పోషించేవారని చెప్పారు.
గెలిపించి బాసటగా నిలవండి
ఉపాధ్యాయులకు డిఎలు, జీతాలు తదితర సమస్యలను కూడా పరిష్కరించే స్థాయి వీరికి లేకుండాపోయిందని మండిపడ్డారు. మార్పు రావాలంటే అది మోదీ నేతృత్వంలోని బీజేపీతోనే సాధ్యమని అన్నారు. మూడు శాసనమండలి ఎన్నికల్లో మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు తమను గెలిపించి బాసటగా నిలిస్తే ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో మరింత బలం సమకూరుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమరవీరుల ఆకాంక్షలు, నీతివంతమైన ప్రభుత్వం అధికారంలోకి రావాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు. మోదీ నేతృత్వంలో సుభిక్ష పాలన అందించే అభ్యర్థులను గెలిపించుకుందామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్ లో మూడోసారి, గోవాలో మూడోసారి, గుజరాత్ లో ఆరోసారి, హరియాణాలో మూడోసారి ఇలా అనేక రాష్ర్టాల్లో బీజేపీ నీతివంతమైన ప్రభుత్వాలు అధికారం చేపట్టాయని చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభిప్రాయాలను గౌరవించే అభ్యర్థులను గెలిపించాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
