- పామ్ ఆయిల్ సాగును ఘననీయంగా పెంచాలి
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ముద్ర ప్రతినిధి, వనపర్తి : దేశంలో ఉన్న మంచి నూనె కొరతను అధిగమించి ఇతర దేశాలకు ఎగుమతి చేసేస్తాయికి ఎదిగేందుకు అత్యధికంగా పామాయిల్ సాగుని పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి వనపర్తి జిల్లాలో పర్యటించి దేవరకద్ర నియోజకవర్గంలోని సంకిరెడ్డి పల్లి గ్రామంలో ప్రీయునిక్ సంస్థ ద్వారా నిర్మించనున్న పాయిల్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పామాయిల్ రైతులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలకు అవసరమైన మేరకు వంట నూనె ఉత్పత్తి లేకపోవడం వల్ల ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని తద్వారా మన ఫారెన్ నిల్వలు ఇతర దేశాలకు చెల్లించడం జరుగుతుందన్నారు. దేశంలో వంటనూనెల లోటు భర్తీ చేయాలంటే 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ పెట్టుబడి తో అత్యధిక లాభం పొందే పంట పామాయిల్ పంట మాత్రమే అని అన్నారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం ద్వారా ఎకరాకు 51 వేల సబ్సిడీ ఇస్తుందన్నారు. మొక్కల పంపిణితో మొదలుకొని డ్రిప్, 4 సంవత్సరాల వరకు అంతర్ పంట సబ్సిడీ కింది ఎకరాకు 4200 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుం దన్నారు. ఆయిల్ పామ్ కంపెనీ వారు రైతులతో ఒప్పందం చేసుకుని పంట చేతికి వచ్చాక నేరుగా కంపెనీ వారే కొనుగోలు చేసుకుంటారని చెప్పారు.
ప్రస్తుతం పామాయిల్ గెలలు మార్కెట్ లో టన్నుకు 20,487 రూపాయల ధర పలుకుతుందనీ త్వరలోనే 25 వేలకు చేరుకుంటుందని తెలియజేశారు. ఇప్పుడు భూమి పూజ చేస్తున్న పామాయిల్ కంపెనీ. ఆగష్టు 15 నాటికి ప్రారంభోత్సవం చేస్తామని అదేవిధంగా బీచ్ పల్లి వద్ద ఉన్న వేరు సెనగ ఆయిల్ కంపెనీని మరమ్మతులు చేసి పామాయిల్ కంపెనీగా ఇదే సంవత్సరంలో ప్రారంభించుకుంటామని భరోసా ఇచ్చారు. రైతులు రాష్ట్రంలో అత్యధికంగా పామాయిల్ సాగు చేపట్టాలని రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ తోట సాగు చేయించి ప్రతి జిల్లాకు ఒక పామాయిల్ కంపెనీ స్థాపించడం ప్రభుత్వ లక్ష్యంగా ప్రకటించారు. రైతులు పంట మార్పిడి వైపు అలోంచించాలని వనపర్తి జిల్లాలో 11 వేల ఎకరాల్లో సాగుకు లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. పామాయిల్ సాగులో భారత దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలని తెలిపారు. దేవరకద్ర శాసన సభ్యులు, వనపర్తి శాసన సభ్యులు అడిగిన అన్ని అభివృద్ధి పనులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సంకిరెడ్డి పల్లి గ్రామ ప్రజలకు పామాయిల్ కంపెనీ వల్ల ఎలాంటి నష్టం జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని, అవసరం అయి వారు కోరుకుంటే ఇక్కడి నుంచి తరలించడానికి సైతం వెనూకాడమని హామి ఇచ్చారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న పామాయిల్ కంపెనీ ఎట్టకేలకు ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగిందని, త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రీయునిక్ సంస్థను కోరారు.
జిల్లాలో ఇది వరకే సాగు చేసిన పంటకు గెలలు కోతకు వస్తున్నాయని, వాటిని కోసిన 24 గంటల్లో అయిల్ గా మార్చాల్సి ఉంటుందని లేనియెడల అది పనికిరాకుండా పోతుందన్నారు. భారత దేశం వంటనూనెలు, పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వేరుశెనగ హెక్టారులో తీసిన వేరుశెనగ నుండి వంట నూనె 0.4 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయితే పామాయిల్ గెల నుంచి హెక్టారుకు 4 మెట్రిక్ టన్నుల వంట నూనె ఉత్పత్తి అవుతుందన్నారు. పామాయిల్ సాగు వల్ల సంవత్సరానికి ఎకరాకు 1.5 లక్షల ఆదాయం వస్తుందని తెలియజేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని, బడుగు బలహీన వర్గాలు, రైతుల సమస్యలు తన సమస్యలు గా భావించి పరిష్కరిస్తున్నారని అన్నారు. ఇంటింటి సర్వే, కులగణన విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. స్థానిక శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సంకిరెడ్డి పల్లిలో పామాయిల్ కంపెనీ ఏర్పాటు వల్ల పర్యావరణ హానికర వ్యర్థాలు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. సహకార సంఘాల అధ్యక్షులు పదవీకాలం మరో 6 నెలలు పొడిగించినందున ధన్యవాదాలు తెలిపారు. భుత్పూర్ అడ్డాకుల మధ్య మరో మార్కెట్ యార్డు మంజూరు చేయాలని, దేవరకద్ర నియోజకవర్గంలో మరో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం ను మంజూరు చేయాలని మంత్రిని కోరారు. మండలాల్లో వ్యవసాయ అధికారులకు కార్యాలయాల కొరత ఉందని వాటిని మంజూరు చేయాలని, రైతులకు వ్యవసాయ పనిముట్లు మంజూరు చేయాలని కోరారు. ఆయిల్ పామ్ కంపెనిలో పనిచేసేందుకు ఈప్రాంత ప్రజలకే ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 1680 మంది రైతులు 5500 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారని, త్వరలో 10 వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యానవన శాఖలో సిబ్బంది కొరత ఉందని వాటిని భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు వంతెనల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామని, జిల్లాలో వేరు సెనగ సాగు ఎక్కువగా ఉన్నందున పెద్ద మందడి మండలంలో వేరు శెనగ పరిశోధన కేంద్రం మంజూరు చేయాల్సిందిగా మంత్రిని కోరారు.
వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యాన వన శాఖ మేనేజింగ్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, డి.సి.సి.బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సైతం మాట్లాడారు. అంతకు ముందు పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఉప వైద్య కేంద్ర భవనం, మోజర్ల గ్రామ పంచాయతీ పరిధిలో రూ. 8.38 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన వ్యవసాయ గోదాముల సముదాయానికి శంఖుస్థాపన చేశారు. అదేవిధంగా పెబ్బరులో రూ. 5.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న మరో వ్యవసాయ గోదాము 5000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినది, రూ. 44 లక్షల వ్యయంతో వ్యవసాయ కార్యాలయ అదనపు భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. రూ. 3.00 కోట్లతో పెబ్బేరులో ఇంతకుముందు కాలిపోయిన మార్కెట్ యార్డు గోదాము పునర్నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం గోపాల్ పేట మండలం బుద్దారం గండి ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామిని దర్శనం చేసుకున్నారు. అక్కడే గోపాల్ పేట మండలం పోల్కేపాడ్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ యార్డు, ఘనపూర్ మార్కెట్ యార్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అదనపు కలక్టర్ రెవెన్యూ జి . వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం , వనపర్తి మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర మార్కెట్ యార్డు చైర్మన్ ప్రశాంత్, పి. ఏ.సి.ఎస్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.