ముద్ర : మల్కాజిగిరి
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మల్కాజిగిరి ప్రాంతంలో నెలకొన్న మంచినీటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్, బీజేపీ సీనియర్ నాయకుడు శ్రవణ్ వాటర్ వర్క్స్ అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ప్రత్యేకంగా బోర్వెల్ నీటిపై ఆధారపడ్డ బస్తీలలో బోర్వెల్లు పనికిరాని స్థితిలో ఉన్నాయని, వాటి మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల వాటర్ వర్క్స్ బోర్డు నుంచి మంజూరైన భూగర్భ డ్రైనేజీ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
రిజర్వాయర్లో సాంకేతిక సమస్యలు, మోటార్లు పాడైపోవడం వంటి కారణాల వల్ల తరచూ మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగుతోందని తెలిపారు. ముఖ్యంగా ఓల్డ్ మల్కాజ్గిరి ప్రాంత ప్రజలు తక్కువ ప్రెషర్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.
అదేవిధంగా, అనేక ప్రాంతాల్లో మొరీల నుండి తీసిన సిల్టును అక్కడికక్కడే వదిలివేయడం వల్ల తిరిగి అదే సిల్ట్ మొరీల్లో చేరుతోందని, సిల్ట్ ఎత్తివేతకు సరైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నందు యాదవ్, మురళి గౌడ్, ఆనంద్ ముదిరాజ్, నరసింహ, మాధవ్, రవి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.