Take a fresh look at your lifestyle.

కమర్షియల్ టాక్స్  లక్ష్యాలను చేరుకుంది 

  • ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ల గుర్తింపును విస్తృతంగా వినియోగించాలి.
  • ట్రైబల్ సొసైటీ ల్లో నిజమైన లబ్ధిదారులను గుర్తించండి.
  • రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
ముద్ర, తెలంగాణ బ్యూరో: గత సంవత్సరంతో పోలిస్తే కమర్షియల్ టాక్స్ శాఖలో మొత్తంగా  6 శాతం ప్రగతి కనిపించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఅన్నారు.ఇది ఒక మంచి పరిణామం అని పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగగా కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్చి మాసంలో  సీఎస్ టి, వ్యాట్ ఓవరాల్ గ్రోత్ రూ. 600 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా సుమారు 500 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరిందన్నారు.ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఎక్కడైనా లీకేజీలు ఉంటే వాటిని గుర్తించి సరి చేయాలని ఆదేశించారు.అపార్టు మెంట్లు, ఫ్లాట్స్ విక్రయాల్లో మంచి ప్రగతి కనిపిస్తున్నప్పటికీ వ్యవసాయ భూములు, ఓపెన్ ఫ్లాట్స్ విక్రయాల్లో ఆశించినంత వేగం కనిపించడం లేదన్నారు.ఇక రవాణా శాఖలో కొత్తగా తీసుకొచ్చిన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ANPR) వివిధ శాఖల్లోనూ విస్తృతంగా వినియోగించుకుని,పెద్ద మొత్తంలో తనిఖీలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది. గిరిజన ప్రాంతాల్లో ఉన్న సొసైటీల ద్వారా ఇసుక అమ్మకాలు జరపాలని, నిజమైన వారిని గుర్తించి ట్రైబల్ సొసైటీ లో సభ్యులుగా చేర్చాలని, గిరిజన సంక్షేమ శాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి పకడ్బందీగా అమలు చేసి అసలైన గిరిజనులకు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని మంత్రుల బృందం సూచించింది.జిల్లా కేంద్రాల్లో ఉన్న విలువైన భూములను గుర్తించి వాటిని సంరక్షించే బాధ్యతలు వెంటనే చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది.నిర్మాణం అనుమతుల విషయంలో  హెచ్ండిఎ వేగం పెంచాలని పేర్కొన్నది.ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్,  సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్, కమర్షియల్ టాక్స్ కమిషనర్ హరిత, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్, రిజిస్ట్రేషన్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి , డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.