ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు.
మంగళవారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సింహ హాజరై మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక వాగ్దానాలు ప్రకటించి అమలు మాత్రం చేయడం లేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు తప్ప పెన్షన్ల పెంపు, సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహిళలకు నెలకు 2500 రూపాయలు, నిరుద్యోగ భృతి, దళితులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బంద్ పథకం, పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ, రైతు భరోసా లాంటివి ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు మోట ఎల్లయ్య, కొండపురం యాదగిరి, మధ్యపురం బాల్ నర్సింహ, జిట్ట అంజిరెడ్డి పాల్గొన్నారు.