Take a fresh look at your lifestyle.

ఆయిల్ పామ్ పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులతో ఆర్థికంగా బలపడాలి

  • రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన.
  • వికారాబాద్ జిల్లా కొత్రేపల్లిలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాటేషన్ డ్రైవ్ లో పాల్గొన్న మంత్రి.

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: ఆయిల్ పామ్ పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులతో ఆర్థికంగా బలపడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు.మంగళవారం వికారాబాద్ పరిసర ప్రాంతంలోని కొత్రేపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాటేషన్ డ్రైవ్ లో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి రైతులను ఆదుకునే దిశగా పనిచేస్తుందన్నారు. పామ్ ఆయిల్ పంట సాగుతో అధిక లాభాలు ఆర్జించడంతో పాటు మూడు సంవత్సరాల పాటు అంతర్గత కూరగాయ పంటలతో వ్యవసాయం సాగు చేయవచ్చునని మంత్రి తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటకు ప్రభుత్వం సబ్సిడీని అందిస్తూ రైతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. రైతులకు మొక్కలు ఇవ్వడంతో పాటు డ్రిప్ పరికరాలను అందించే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని అదేవిధంగా మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. అధిక దిగుబడి వచ్చే విత్తనాలను రైతులకు అందించాలని మంత్రి సూచించారు. జిల్లాలో పెద్ద మొత్తంలో ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసినట్లయితే రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఫ్యాక్టరీని శంకుస్థాపన చేసుకుందామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా రైతు భరోసా, రైతు బీమా పథకాలను అమలుపరుస్తున్నామని, త్వరలోనే పంటల బీమా ను కూడా వర్తింప చేస్తామని మంత్రి తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధికంగా ప్రాముఖ్యత నిస్తూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర లోనే వ్యవసాయ రంగం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని, రైతులను రుణ బారం నుండి విముక్తులను చేయడానికి 25 లక్షల మంది రైతులకు చెందిన 21 వేల కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందని సభాపతి తెలిపారు. రైతు భరోసా ను ఏడాదికి ఎకరాకు 12 వేలకు పెంచి కేవలం తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగిందని ఆయన అన్నారు. రైతు బీమా, సన్న రకాల వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్, వ్వవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతుల కష్టాలు తీర్చడానికి భూ భారతి తీసుకువచ్చని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లాలో మంచి సారవంతమైన భూములు ఉన్నాయని, ఆయిల్ ఫాం పంటకు అనుకూలంగా ఉంటాయని ఆయన తెలిపారు. వరి పంటకు అవసరమైన ఒక్క ఎకరం నీటితో నాలుగు ఎకరాల ఆయిల్ ఫాం తోటలను సాగు చేయవచ్చని, నాటిన మొదటి నాలుగు సంవత్సరాలు 50 వేల 918 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని ఆయన తెలిపారు. ఆయిల్ ఫాం మొక్కలను ఒకసారి నాటితే 40 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తుందని ఆయన అన్నారు.దొంగల భయం, కోతుల బెడద, చీడపీడలు బాధ ఉండదని ఆయన అన్నారు.ఆయిల్ ఫాం గెలలను ఫ్యాక్టరీ వాళ్ళే డైరెక్ట్ గా కొనుగోలు చేస్తారు కాబట్టి మార్కెటింగ్ ఇబ్బందులు కూడా ఉండవని సభాపతి తెలిపారు.మన దేశం ఏడాదికి లక్ష కోట్ల విలువైన ఆయిల్ ఫాం ను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుందని కాబట్టి మన దగ్గర ఎప్పటికీ డిమాండ్ ఉంటుందని ఆయన అన్నారు.ఆయిల్ ఫాం తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలని, ఆయిల్ ఫాం తోటల సాగుకు ఆసక్తి ఉన్న రైతులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామని సభాపతి అన్నారు.గత ప్రభుత్వం పదేళ్ళ పాలనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని,ప్రాణహిత- చేవెళ్ల మరియు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులకు నిధులు ఇవ్వలేదని అన్నారు.ప్రాణహిత చేవెళ్ల పథకం ద్వారా వచ్చే అయిదేళ్ళలో మన ప్రాంతానికి సాగు నీరు తెస్తానని స్పీకర్ హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ హష్మీన్ భాష, డిప్యూటీ డైరెక్టర్ నీరజ గాంధీ, జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి సత్తార్, వ్యవసాయ శాఖ అధికారి రాజా రత్నం, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.