మహదేవపూర్ ముద్ర:
సరస్వతి పుష్కరాల సమయంలో భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక వాతావరణాన్ని కల్పించే విధంగా, భక్తులను రంజింపజేసేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు. మే 21 నుండి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రతిరోజు ప్రముఖ కళాకారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు భక్తులను ఆకట్టుకునే విధంగా సంగీత, నృత్య, జానపదాల వంటి కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు సమయపాలనతో, క్రమబద్ధంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, వేదికలు, సౌండ్, లైటింగ్ తదితర ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఆయనతోపాటు తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయ పరిపాలన అధికారి విజయ్, భూపాలపల్లి టీఎస్సెస్ కళాకారుడు మైసా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.