ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ డ్రైవ్లో భాగంగా మొత్తం 340 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వీరిలో 275 ద్విచక్ర వాహనదారులు, 14 ఆటోలు, 48 కార్లు, 03 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే — 273 మంది 35 ఎంజీ 100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ 100 ఎంఎల్ మధ్య 46 మంది, 201 ఎంజీ, 100 ఎంఎల్ నుంచి 300 ఎం జీ/100 ఎంఎల్ మధ్య 21 మంది, 301 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 550 ఎం జీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారు. వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు సంబంధిత పోలీసులు అధికారులు తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది.గత వారంలో మొత్తం 257 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయని, వీరిలో ఐదుగురికి జరిమానా-జైలు శిక్ష, 12 మందికి జరిమానా-సోషల్ సర్వీస్, 240 మందికి జరిమానా విధించబడినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.