రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
ముద్ర, తెలంగాణ బ్యూరో:
రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ మేరకు కిషన్ రెడ్డి మంగళవారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు. అందులో కీలక అంశాలు ప్రస్తావించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టో ద్వారా ప్రజలకు ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను ఇచ్చిందన్నారు. ఈ హామీలను నమ్మిన ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ మీరిచ్చిన హామీల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానా గురించి ఇలా మాట్లాడిన మీరే ఇటీవల ఓ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ. వెయ్యి కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. మీరు మాట్లాడిన తీరు చూస్తుంటే రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్ అనేలా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటి వరకు రూ. 12 లక్షలకోట్ల నిధులు ఇచ్చిందన్న కిషన్ రెడ్డి…. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని దుయ్యబట్టారు.