- కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జువ్వాడి మానుక ప్రవీణ్ కుమార్.
కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం లోని చెడిపోయిన రోడ్లు, మురికి కాలువలతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, కల్లూరు, కోరుట్ల సంఘం, యామాపూర్, ఫకీర్ కొండాపూర్ వాగులపై వెంటనే బ్రిడ్జిలు నిర్మాణం పనులను చేపట్టాలని, అలాగే ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి పౌరుడు చెట్లు నాటి, పచ్చదనం పరిశుభ్రత కాపాడాలన్నారు. అర్హులందరికి రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రధాన రహదారులపై పలుచోట్ల మూలమలుపులో వాహనదారులను అప్రమత్తం చేసేలా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, కోరుట్ల మద్దుల చెరువును మరో ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలని కోరుట్ల తహసిల్దార్ కార్యాలయ భవనం పిల్లర్ల దశలో నిలిచిన భవన నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని, కోరుట్ల నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా చేసేలా ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్, స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజగణేష్, పాతర్ల విజయ్, ఎండి. రఫీఉద్దీన్, మహాదేవ్, బాలే మారుతి, తెలుగు మహిళ నాయకురాలు కే దివ్య, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.