ధర్మపురిలో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే చైర్మన్. వైస్ చైర్మన్ ఎంపిక..
ధర్మపురి:
ధర్మపురి మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సోమవారం ధర్మపురి మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికకు మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి ప్రజలు తనపై విశ్వాసంతో 15 వార్డుల్లో 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. 2009 నుండి గెలిచిన ఓడిన నియోజక వర్గంలోనే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అయ్యానని మంత్రి తెలిపారు.
ధర్మపురి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారని మంత్రి తెలిపారు. ఇందులో సంఘనభట్ల దినేష్ సంతోషి, వేముల నాగలక్ష్మి లు పోటీ పడగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజ నిర్ణయంతో వేముల నాగలక్ష్మి ధర్మపురి మున్సిపల్ చైర్మన్ గా ఇందారపు రామన్నను వైస్ చైర్మన్ గా ఎంపిక చేసినట్లు మంత్రి వివరించారు.
మొదటి రెండు సంవత్సరాలు ధర్మపురి మున్సిపల్ చైర్మన్ గా నాగలక్ష్మి తర్వాతి మూడు సంవత్సరాలు సంఘనభట్ల సంతోషిని చైర్మన్ గా కొనసాగుతారని మంత్రి వివరించారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం పోటీ పడిన సంఘనభట్ల దినేష్ సంతోషి గారికి త్వరలోనే రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి వారి గౌరవాన్ని కాపాడతానని మంత్రి హామీ ఇచ్చారు.
మున్సిపల్ చైర్మన్ పదవి కోసం పోటీ పడిన ఇద్దరు తనకు కావలసిన వారేనని మంత్రి వివరించారు. కష్ట కాలంలో పార్టీకి, తనకు వ్యక్తిగతంగా చేసిన సేవలు మరువలేని మంత్రి అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా పట్టణంలో ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించమని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 60 రోజుల్లో నెరవేర్చిన అనంతరం విజయోత్సవాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కొత్తగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు వారి వారి వార్డులో ఓటర్లను కలిసి కృతజ్ఞతలు తెలపాలని మంత్రి సూచించారు.