ముద్ర సంగారెడ్డి,మార్చి:
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (ఎన్ఎఫ్బీఎస్) పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈమేరకు శనివారం విడుదల చేసిన ఓప్రకటనలో వివరించారు.జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.గ్రామ సభలు, అవగాహన కార్యక్రమాలు, ప్రచార వాహనాల ద్వారా పథకం వివరాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు.
ఈపథకం కింద కుటుంబానికి ప్రధాన ఆర్థిక ఆధారంగా ఉన్న వ్యక్తి మరణించినప్పుడు కుటుంబానికి ఒకసారి మాత్రమే రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేస్తారు. కుటుంబంలో బిలోపవర్టీ లైన్ (బీపీఎల్) కేటగిరీకి చెందినవారై ఉండాలనీ, మరణించిన వ్యక్తి వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు.సహజ మరణం గానీ,ప్రమాదవశాత్తు మరణం గానీ జరిగినా ఈ పథకం వర్తిస్తుందనీ,ఈఆర్థిక సహాయం కుటుంబంలోని భార్య లేదా భర్త,చిన్న పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులకు అందుతుందనీ వెల్లడించారు. తహసీల్దార్ కార్యాలయం ద్వారా దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులు అనుమతి ఇస్తారు.పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారు మరణ ధ్రువీకరణ పత్రం, మరణించిన వ్యక్తి మరియు దరఖాస్తుదారుని ఆధార్ కార్డు, బీపీఎల్ లేదా రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.అర్హత కలిగిన పేద కుటుంబాలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించి వారికి ఆర్థిక సహాయం అందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.