ముద్ర ప్రతినిధి,ఆదిలాబాద్: ఆపత్కాలంలో ఉన్న అతివలకు అండగా ఉండాలని సఖి కేంద్రం సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రం లోని కలెక్టర్ చౌరస్తానందుగల సఖి కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ తో కలిసి సందర్శించి పరిశీలించారు. సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ సఖి కేంద్రం ద్వారా కుటుంబ కలహాలతో ఉన్న మహిళలకు మరియు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ సేవలు అందించబడతాయని, కౌన్సిలింగ్ ద్వారా సంపరిష్కారం కానీ సందర్భాలలో పోలీసు సహాయం, న్యాయ సహాయంతో అతివలకు తగు న్యాయం చేకూర్చే సేవలు లభిస్తాయని ఎలాంటి ఆపద సందర్భంలోనైనా అతివలు సఖి కేంద్రాన్ని సంప్రదించిన యెడల వైద్య సదుపాయం మరియు వసతి సదుపాయం ఉంటుందని తెలిపారు. మహిళలు యువతులు చిన్నారులు ప్రతి ఒక్కరూ సఖి కేంద్రాన్ని యొక్క సేవలను ఆపద సమయంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర సమయాలలో డయల్ 100 సేవలు లేదా సఖి కేంద్రం కై 181 నెంబర్ పై సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సఖి కేంద్ర నిర్వాహకులు మరియు ఆదిలాబాద్ ఒకటో పట్టణ సిఐ బి సునీల్ కుమార్, సఖి సెంటర్ సిబ్బంది లావణ్య, సంఘమిత్ర, అక్షయ్, నాగమణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.