
సంగారెడ్డి ముద్ర ప్రతినిధి :
జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా చిత్తశుద్దితో కృషి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్ ఏ ఈ ఓ లకు సూచించారు.జిల్లా వ్యాప్తంగా 3,750 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం కాగా, ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు.
కలెక్టరేట్ సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓ లతో ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా సమీక్ష జరిపారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఎంతో లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 1,850 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు జరిగిందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు లాభాలపై రైతులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించి , లక్ష్యానికి మించి అధిక విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
అదేవిధంగా యూరియాకు ఎలాంటి కొరత లేదని సరిపడి యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్ణిత సమయంలోగా చేయాలనీ సూచించారు. రైతు బీమా కు సంబంధించి క్లియర్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వర్,గోద్రెజ్ సంస్థ జనరల్ మేనేజర్ స్వీటీ , ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు,ఏ.డి ఏ లు, ఏ.ఈ.ఓ లు పాల్గొన్నారు.