Take a fresh look at your lifestyle.

14–15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి:
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో కీలకమైన హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను జిల్లాలోని 14–15 సంవత్సరాల బాలికలందరికీ మిషన్ మోడ్‌లో అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వైద్య అధికారులకు ఆదేశించారు.కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ వైద్యశాఖ అధికారులతో హెచ్‌పీవీ వ్యాక్సిన్ అమలు,మహిళా స్వయం సహాయక సంఘాల హెల్త్ ప్రొఫైల్,డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలపై సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 14–15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలందరికీ తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి డీఆర్‌డీఓఏ,మెప్మా, డీఈఓలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, బాలికలను సమీప పీహెచ్‌సీలకు తీసుకువచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని అర్హులైన అందరు బాలికలకు మిషన్ మోడ్‌లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు.
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య స్క్రీనింగ్ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.జిల్లాలో ఇప్పటివరకు పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో స్పెషలిస్ట్ డాక్టర్లతో నిర్వహించిన క్యాంపులు,రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీవీపీ స్పెషలిస్ట్ డాక్టర్లు,ఆర్‌బీఎస్‌కే బృందాల ద్వారా నిర్వహించిన స్క్రీనింగ్ కార్యక్రమాల వివరాలను వైద్య అధికారులు కలెక్టర్‌కు వివరించారు.స్క్రీనింగ్ సమయంలో గుర్తించిన అనుమానాస్పద కేసులను తదుపరి పరీక్షలు,చికిత్స కోసం రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు.ప్రతిరోజూ ఒక పీహెచ్‌సీ/యూపీహెచ్‌సీలో స్పెషలిస్ట్ డాక్టర్లతో స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు, రోజుకు 9 రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీవీపీ స్పెషలిస్ట్ డాక్టర్లు,ఆర్‌బీఎస్‌కే బృందాలు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
స్వయం సహాయక సంఘాల మహిళల హెల్త్ ప్రొఫైల్ అమలుకు సంబంధించి పూర్తి కార్యాచరణ ప్రణాళికతో షెడ్యూల్ సిద్ధం చేయాలని డీఆర్‌డీఓఏ అధికారులకు ఆదేశించారు.డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు అవసరమైన మౌలిక వసతులు,ఇంటర్నెట్ సదుపాయం,నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి సూచనలు చేశారు.ఈసమావేశంలో డీఆర్‌డీఓఏ జ్యోతి,అడిషనల్ పీడీ సూర్యారావు, డీసీహెచ్‌ఎస్ కవిత,జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ,డాక్టర్ శశాంక్ తదితర వైద్యాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.