(ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య చూపిన స్ఫూర్తిని కొనసాగించాలని అని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దొడ్డి కొమురయ్య 98వ జయంతి ఉత్సవంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పాల్గొనీ జ్యోతి ప్రజ్వలన చేసి దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా డిఆర్ఓ మాట్లాడుతూ.. దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని కొనసాగించాలని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తలచుకోగానే మొదటగా గుర్తు వచ్చేది పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని, తెలంగాణలో భూస్వామ్యపాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో 1927 ఏప్రిల్ 3న జన్మించారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమడానికి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణమన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి బి.కేశురాం, కలెక్టరేట్ ఏఓ సునీల్, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు పి.రమేష్, వై.మాధవ రెడ్డి, కుల సంఘం నేతలు బీసీ ఫ్రంట్ చైర్మన్ జి.మల్లేష్ యాదవ్, సి. హెచ్. కొండయ్య, చిత్తరంజన్, కాటపల్లి శ్రీశైలం పొన్నాల సురేష్, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.