ముద్ర ప్రతినిధి, భువనగిరి
రమణేశ్వరం మహాక్షేత్రంలో జరుగుతున్న 11 రోజుల దసరా ఉత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. మూడో రోజు బుధవారం సిద్ధగురు రమణానంద మహర్షి నేతృత్వంలో చంద్రఘంటా దేవి, భువనేశ్వరి దేవి, కౌమారి మాతృకల ఆరాధన జరిగింది. శత్రు నాశన హవనం నిర్వహించి, దుష్ట శక్తుల నివారణకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సహస్ర శ్రీచక్రాలు, శివలింగాలకు అభిషేకాలు నిర్వహించబడ్డాయి. ఆలయంలో ప్రతిధ్వనించిన మంత్రోచ్చారణలు, హోమాగ్నిజ్వాలల వెలుగులో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు.
అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించి ప్రసాదం పంపిణీ చేశారు. “శివారాధన లేక శక్తి ఆరాధన, శక్తి ఆరాధన లేక శివారాధన పూర్ణత్వాన్ని

ఇవ్వవు. శివ–శక్తి కలిసినప్పుడే సంపూర్ణత్వం లభిస్తుంది. చంద్రఘంటా దేవి ఉపాసన భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపుతుంది. భువనేశ్వరి మాత మాయాశక్తిని ప్రసాదిస్తుంది. కౌమారి మాతృక సంతానం, శాంతి, శత్రు నాశనాన్ని అనుగ్రహిస్తుంది” అని సిద్ధగురు రమణానంద మహర్షి ఉద్బోధించారు.
ముద్రలు, బీజాక్షరం గురించి కూడా భక్తులకు మార్గదర్శనం చేసి సరైన ముద్రలతో ధ్యానం చేస్తే ఆరాధన ప్రభావం మరింత పెరుగుతుందని చెప్పారు. ఈ దివ్య ఆరాధన రాబోయే దసరా ఉత్సవాలపై భక్తుల్లో మరింత ఆసక్తి, భక్తి పటిమను కలిగించింది