ముద్ర ప్రతినిధి, కరీంనగర్: రైతుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ పరిధిలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న బిఎస్సి చివరి సంవత్సరం విద్యార్థులు నూతన వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ విధానం, వాతావరణ మార్పులను విశ్లేషిస్తూ కాలనుగుణంగా వేసే పంటల గూర్చి రైతులకు వివరించారు. “గ్రామీణ వ్యవసాయ పని అనుభవం” అనే కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో రైతులు పండిస్తున్న పంటలను వారి వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలో వనరులు, వ్యవసాయ కాలచక్రం, కాలనుగుణంగా పండించవలసిన పంటలు, వ్యవసాయ విధానంలో అధిక దిగుబడి పొందడానికి కావలసిన విలువైన సమాచారాన్ని నేలపై చిత్రాల రూపంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, ప్లాంట్ బ్రీడింగ్ సైంటిస్ట్ ఉషారాణి, కళాశాల విద్యార్థినిలు శ్రీజ, రమ్య, నవ్య, మౌనిక, సుష్మిత తో పాటు గ్రామంలోని రైతులు పాల్గొన్నారు.