ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని, విద్యార్థులకు విద్యార్థి దశ నుండే పర్యావరణ సంరక్షణ పై, పచ్చదనం వలన కలిగే ప్రయోజనాల పై అవగాహన కలిగించాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సూచించారు. బుధవారం టీవీ 9 ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అమన్ గల్ మండలంలోని గుమ్మడివల్లి ఫారెస్ట్ ఏరియాలో సీడ్ బాల్స్ వేసే కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిధిగా పాల్గొని సీడ్ బాల్స్ వేశారు.ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సీడ్ బాల్ తయారీ పురాతన కాలం నాటిదని, జపాన్ లో సీడ్ బాల్ తయారీ విధానం ఉండేదని, విత్తన బంతులను బంక మట్టి, కంపోస్ట్ వంటి వాటితో కలిపి బంతులుగా తయారు చేస్తారని, అడవులలోని ఖాళీ ప్రదేశాలలో, మనుషులు, వాహనాలు వెళ్లని ప్రాంతాల్లో ఈ విత్తన బంతులను విసిరితే చాలు వాటిలో ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయని అన్నారు. ఇది సహజంగా మొక్కలు పెరిగేలా చేస్తుందని, రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు, వాటికవే మొక్కలు మొలకెత్తుతాయని తెలిపారు. స్థానిక విత్తనాలు, బంకమట్టి, కంపోస్ట్ మిశ్రమంతో తయారు చేయబడిన విత్తన బంతులను (సీడ్ బాల్స్) బహిరంగ లేదా బంజరు ప్రాంతాలలో వేయడానికి రూపొందించడం జరిగిందని తెలిపారు. విరివిగా చెట్లను నాటడం వలన అడవిని, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. రాష్ట్రమంతట పచ్చదనం పెంపొందించేలా ప్రతి ఒక్కరూ చెట్లను నాటలని అన్నారు. చెట్లను పెంచడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడం జరుగుతుందని, జీవవైవిధ్యన్ని కాపాడుకోగలుగుతామని అన్నారు. చెట్లను పెంచడం ద్వారా వర్షాలు సకాలంలో కూరుస్తాయని, వంద శాతం మొక్కలు నాటేందుకు కృషి చేయాలని, భౌగోళిక పరిస్థితి మెరుగుపడే విధంగా రాష్ట్రమంతా విరివిగా వనాలను పెంచాలని, అందుకు అందరూ భాగస్వాములు కావాలని అన్నారు.ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కలు నాటలని పిలుపునిచ్చారు.ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని, మీ పిల్లల్లాగే నాటిన మొక్కలను సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను భాగస్వాములను చేయడం ఎంతో సంతోషంగా ఉందని, పిల్లలకు చిన్నతనం నుండే ప్రకృతి పట్ల, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కలిగించాలని తెలిపారు. ఇది చాలా మంచి కార్యక్రమమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తొడ్పడాలని పిలుపునిచ్చారు. ఓపెన్ ఫారెస్ట్లో చెట్లను నాటడం కష్టంగా మారినప్పుడు ఈ సీడ్ బాల్ (విత్తన బంతులు) కార్యక్రమం బాగా పని చేస్తుందన్నారు. పర్యావరణానికి మేలు చేసే ఇలాంటి కార్యక్రమాలు అవసరం అని ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం మంత్రి విద్యార్థులతో, స్థానిక ప్రజాప్రతినిధులతో, అధికారులతో కలిసి విత్తన బంతులను గుమ్మడివల్లి ఫారెస్ట్ ఏరియాలో వేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట చీఫ్ కనసర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ప్రియాంక వర్గీస్, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.