ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూలు:
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించి భారీగా నల్లబెల్లాన్ని పట్టుకున్నారు. సుమారు 750 కిలోల నల్లబెల్లాన్ని సారా తయారీకి తరలిస్తున్నట్లు అనుమానిస్తూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గోప్య సమాచారంతో స్పందించిన ఎక్సైజ్ సిబ్బంది, లింగాల మండలం వైపు తరలిస్తున్న సమయంలో ట్రాక్టర్ (TS 31 2290) ను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లబెల్లం తరలింపును గుర్తించి ట్రాక్టర్ను సీజ్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల తాండకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి పై కేసు నమోదు చేశారు.
ఈ విషయాన్ని ఎక్సైజ్ సీఐ బి. నాగిరెడ్డి వెల్లడించారు. దాడిలో ఎస్సై మురళి, కానిస్టేబుల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.